మద్యం లారీ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ ప్రజలు..

May 23,2024 17:56 #Liquor lorry, #overturned

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌-బోయినపల్లి పరిధిలో ఓ మద్యం తరలిస్తున్న లారీ బోల్తా పడడంతో స్థానికులు రోడ్డుపై పడ్డ సీసాలను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారాయి. సికింద్రాబాద్‌ – బోయినపల్లి పరిధిలోని ఓ రోడ్డుపై ఈ సంఘటన చోటుచేసుకుంది. మద్యం సీసాలతో వెళ్తున్న లారీని కొంపల్లి ప్రాంతానికి చెందిన బసలింగప్ప నడుపుతున్నాడు.
లారీ బోల్తా పడిన సమయంలో దేవరాయాంజల్లోని ఐఎంఎఫ్‌ఎల్‌ డిపో నుండి ఏకంగా రూ. 32 లక్షల విలువచేసే మద్యం సీసాల స్టాక్‌ ను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత లారీ బోయినపల్లి చెక్‌ పోస్ట్‌ సమీపంలోని లిక్కర్‌ మార్టుకు చేరుకోగా.. ఆ సమయంలోనే లారీ టైరు ఒక్కసారిగా పేలింది. దీనితో లారీ అదుపుతప్పి డివైడర్‌ ను డీ కొట్టింది.
ఆ ఘటనతో ఆ లారీ బోల్తా పడి, మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దాంతో ఆ విషయం తెలిసిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని మద్యం సీసాలను చేత పట్టుకుని పారిపోయారు. ఆ తర్వాత మద్యం సీసాలను తీసుకు పోవడానికి ప్రయత్నించిన మరికొందరిని డ్రైవర్‌ అడ్డుకున్నాడు. దాంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేశారు.

➡️