- పిసిసి మీడియా చైర్మన్ ఎన్.తులసిరెడ్డి
ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్ఆర్ జిల్లా) : కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న వ్యవసాయ రుణమాఫీ పథకం రైతులకు వరమని పిసిసి మీడియా చైర్మన్ ఎన్.తులసిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలోని తన స్వగృహంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని చెప్పారు. పదేళ్ల అరణ్యవాసం ముగిసి రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం మహిళలకు వరమన్నారు. గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీకి విజయ సోపానాలని తెలిపారు. ఉగాది, రంజాన్ పండుగలను పురష్కరించుకొని బస్సు న్యాయ యాత్రకు విరామం ఇచ్చినట్లు చెప్పారు. వైఎస్ షర్మిల ఈ నెల 12న పులివెందుల, 13న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారన్నారు. కాంగ్రెసు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తోందని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ప్రారంభమైందని తెలిపారు.