ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసిపికు బిగ్‌ షాక్‌..!

  • టిడిపిలోకి ఎమ్మెల్యే పార్థసారధి, భవకుమార్‌, తుమ్మల చంద్రశేఖర్‌
  • పసుపు కండువా కప్పి ఆహ్వానించిన లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి : అధికార వైసిపికి ఆ పార్టీ నేతలు షాకుమీద షాకులిస్తున్నారు. ఎన్నికలనాటికి ఆ పార్టీలో ఎంతమంది ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పెనమలూరు ఎమ్మెల్యే, ప్రముఖ బిసి నాయకుడు కొలుసు పార్థసారధి, విజయవాడ నగర వైసిపి అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌, కమ్మ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్‌ సోమవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో ముగ్గురు నేతలకు లోకేష్‌ పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మి తాము టిడిపిలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువనేత నారా లోకేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం టిడిపితో కలసి పనిచేసేందుకు వచ్చిన పార్థసారధి, భవకుమార్‌, చంద్రశేఖర్‌తో పాటు చేరిన నాయకులకు అభినందనలు తెలిపారు. టిడిపిలో అన్నివర్గాలకు సముచిత ప్రాధాన్యత, గౌరవం ఉంటాయని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో పెనమలూరు నియోజకవర్గం నుండి వల్లభనేని సత్యనారాయణ(ఉయ్యూరు మున్సిపల్‌ చైర్మన్‌), నెరుసు రాజ్యలక్ష్మీ(కంకిపాడు ఎంపీపీ) ధూళిపూడి కృష్ణకిషోర్‌(కంకిపాడు వైస్‌ ఎంపీపీ), రొండి కృష్ణా యాదవ్‌(జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్‌), మాడలి రామచంద్రారావు(మండల పార్టీ అధ్యక్షులు), లోయ ప్రసాద్‌(బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), లింగమనేని సత్యవేణి(సీతారామపురం సర్పంచ్‌), పోలవరపు బొబ్బి(తాడిగడప మాజీ ఎంపీటీసీ), పార్టీ నేతలు కొలుసు పోతురాజు, నిడుమోలు పూర్ణచంద్రరావు, కొడాలి రవి, మండవ ప్రగతి, నలి మాధవ్‌, దుద్దుకూరి వెంకటకష్ణారావు, బోడపాడు శంకర్‌, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి తుపాకుల మహేష్‌ (వైసిపి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి), పుప్పాల వెంకటసుబ్బారావు (సీనియర్‌ నాయకులు), మేకల విజయలక్ష్మి (గొల్లపూడి మార్కెట్‌ యార్డు డైరక్టర్‌), చెన్ను సురేష్‌ (విజయవాడ నగర వైసిపి యూత్‌ జనరల్‌ సెక్రటరీ), ఇజ్జడ ప్రదీప్‌ (సిటీ వైసిపి పబ్లిసిటీ విభాగం కార్యదర్శి),ఉప్పులేటి అనిత (నగర వైసిపి లీగల్‌ సెల్‌ విభాగం కార్యదర్శి), పొలిమెట్ల డానియేల్‌ (అఖిలభారత క్రిస్టియన్‌ ఫెలోషిప్‌ ప్రెసిడెంట్‌), నర్రా అరుణ్‌ బాబు (వైసిపి సిటీ యువజనవిభాగం కార్యదర్శి), సోనా సునీత, సోనా జయకుమార్‌, సోనా రాజేశ్వరి, కురుముల రాజా, షేక్‌ నాగూర్‌ తదితర ముఖ్యనేతలు యువనేత సమక్షంలో పార్టీలో చేరారు.

➡️