మంగళగిరిని గోల్డెన్ హబ్ గా తయారు చేస్తాం : నారా బ్రాహ్మణి

Apr 30,2024 17:52 #Mangalagiri, #Nara Brahmani, #tour
  • చేనేత, స్వర్ణకారులను ఆదుకుంటాం

ప్రజాశక్తి మంగళగిరి : 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలో అమరావతికి వచ్చి వెళ్లే వారితో మంగళగిరిలో వ్యాపారాలు బాగా సాగాయని, గడిచిన ఐదేళ్లుగా వ్యాపారాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేనేత వ్యాపారులు, స్వర్ణకారులు నారా బ్రాహ్మణి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రాహ్మణి మంగళగిరిలోని పలు కాలనీల్లో మంగళవారం పర్యటించారు. షరీఫ్ బజార్ లో బంగారు షాపులు, ఆభరణాల తయారీ యూనిట్ ను పరిశీలించారు. వ్యాపారాలు సాగుతున్న తీరు, బంగారం తయారీ విధానం గురించి షాపుల యజమానులను అడిగి తెలుసుకున్నారు. ఓ జ్యువలరీ షాపులో స్వయంగా జుమ్కీలు కొనుగోలు చేశారు. లోకేష్ ని గెలిపించడం ద్వారా మంగళగిరిని గోల్డెన్ హబ్ గా తయారుచేసుకుందామని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.

చేనేత కేరాఫ్ మంగళగిరి
మంగళగిరిలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. పలు షాపుల్లో చేనేత వస్త్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం మంగళగిరి పట్టు చీరలను కొనుగోలు చేశారు. ఎన్నికల తర్వాత లోకేష్ తో కలిసి మంగళగిరిలో పర్యటిస్తానని చెప్పారు.

పచ్చళ్ల తయారీ కేంద్రం పరిశీలన
మంగళగిరి పట్టణంలో విజయ పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని నారా బ్రాహ్మణి పరిశీలించారు. వర్కర్లతో కలిసి ఆవకాయ పచ్చడిని కలిపారు. నిర్వాహకులు తయారు చేసిన కొత్త ఆవకాయ పచ్చడిని రుచి చూశారు. పచ్చడి తింటుంటే చిన్నప్పుడు అమ్మ పెట్టిన ఆవకాయ గుర్తొస్తోందన్నారు. చిరు వ్యాపారులు తమ కాళ్లపై తాము నిలబడి ఉపాధి పొందేలా అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం చెరకు రసం అమ్మే మహిళతో మాట్లాడారు. చెరకు రసం తాగారు. తనకు సొంతిల్లు లేదని , లోకేష్ కి చెప్పి ఇప్పించాలని ఆ మహిళ కోరగా, తప్పకుండా సొంతింటి కల నెరవేరుస్తామని బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గాజుల శ్రీనివాసరావు, టి జానకి దేవి, ఆకుల జయ సత్య, ఆరుద్ర భూలక్ష్మి, దామర్ల పద్మజ, తదితరులు పాల్గొన్నారు.

➡️