ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో ఎలాంటి సంబంధమూ లేదు : మాజీ మంత్రి

హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్ట్‌ అయిన ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో తనకు పరిచయమే లేదని పేర్కొన్నారు. అయితే, ఆయన బంధువులు మాత్రం తమ ఊళ్లోనే ఉన్నారన్న విషయం మాత్రం తనకు తెలిసిందన్నారు. అసలు ఈ కేసులోకి తనను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎర్రబెల్లితో తనకు సంబంధం లేదని విచారణలో స్వయంగా ప్రణీత్‌రావే చెప్పారని గుర్తు చేశారు. పార్టీ మారాలంటూ తనపై ఒత్తిడి ఉందని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఒత్తిడి తీసుకొచ్చినా పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్న శరణ్‌ చౌదరిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు ఉన్నాయని దయాకర్‌రావు తెలిపారు.

➡️