- రూ.46.90కోట్లనుబటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన సిఎం జగన్
ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు వైసిపి ప్రభుత్వం నేడు వడ్డీ రీయింబర్స్మెంట్ చేసింది. తొలిదఫాలో అర్హులైన 4,07,323 మందికి వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. గతంలో సుమారు ఐదు లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు రూ.50 కోట్ల పైబడి ఇచ్చామని.. రూ.35వేల రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని.. అందులో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు.. మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు అవుతోదన్నారు. ఇళ్ల నిర్మాణంకోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని.. సిమెంటు, స్టీల్, మెటల్ ఫ్రేంలు తదితర ఇంటి సామగ్రి మీద కనీసంగా రూ.40వేలు మంచి జరిగేలా చూస్తున్నామని.. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి రూ.2.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉందన్నారు. అన్ని కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.5 -20 లక్షల వరకూ ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగామని సిఎం జగన్ తెలిపారు.