ప్రజాశక్తి-అమరావతి : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇటీవలే ఈ పిటిషన్పై విచారణ ముగియగా.. శుక్రవారం సీఐడీ, చంద్రబాబు తరఫు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. వీటిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది.
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఇతర రోడ్ల అలైన్ మెంట్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో ఏపీ సీఐడీ చంద్రబాబు సహా పలువురిపై కేసు నమోదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1 గా పేర్కొంటూ విచారణ చేపట్టింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు సెప్టెంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. శుక్రవారం ఏపీ సీఐడీ, చంద్రబాబు తరపు లాయర్లు సమర్పించిన లిఖితపూర్వక వాదనలు పరిశీలించింది. శనివారం తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.