ప్రజాశక్తి – కొత్తూరు (శ్రీకాకుళం) :తెలంగాణ ఈాసెట్ పరీక్షలో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం జోగిపాడుకు చెందిన ఆలవెల్లి ఖ్యాతేశ్వర్ మెథడాలజీలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఖ్యాతేశ్వర్ తండ్రి మిన్నారావు విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో కాంపౌండర్గా పనిచేస్తుండడంతో, కొన్నేళ్లుగా అక్కడే స్థిరపడ్డారు. తల్లి హైమావతి గృహిణి. ఖ్యాతేశ్వరరావు ఒకటి నుంచి పదో తరగతి వరకు కంచరపాలెంలోని బాలభారతి పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించాడు. పాలీసెట్లో ర్యాంకు రావడంతో 2023లో కంచరపాలెంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యాడు. ఈ సందర్భంగా ఖ్యాతేశ్వర్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివి ఈ లక్ష్యాన్ని సాధించానన్నాడు. ఇంజనీరింగ్ చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/13-18.jpg)