ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, వైసిపి గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి నారాయణమూర్తి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సిఇఒ ముఖేష్కుమార్ మీనాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 15న ఎన్నికల ప్రచారంలో భాగంగా పలాస, రాజాంలో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఎలాంటి సహేతుకమైన ఆధారాలు లేకుండా కొంత మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులపై ఫిర్యాదులు చేస్తున్నారని, అటువంటి ఫిర్యాదులను పట్టించుకోవద్దని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మరో వినతిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది.