ఎపిడబ్ల్యుజెఎఫ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతి మండలంలోని న్యూస్టుడే కంట్రిబ్యూటర్ విలేకరి పరమేశ్వరరావుపై దాడికి పాల్పడ్డ ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ వెంకట్రావ్, జి ఆంజనేయులు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా అధికార పార్టీ అండతో పెట్రేగిపోతోందని విమర్శించారు. అమరావతి మండలంలో కృష్ణానదిలో అక్రమంగా తవ్వుతున్న ఇసుకపై న్యూస్ కవరేజ్కు వెళ్లిన పరమేశ్వరరావుపై భౌతికదాడికి పాల్పడుతూ పెట్రోల్తో తగలబెట్టేందుకు ప్రయత్నించడం అరాచకమని తెలిపారు. తక్షణం పరమేశ్వరరావుపై దాడికి పాల్పడ్డవారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.