- ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నెల్లూరు జిల్లా కావలిలో విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులకు వెళ్లిన అంగన్వాడీ కార్యకర్త సుభాషిణి మృతి చెందిందని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి బేబిరాణి, కె సుబ్బరావమ్మ వినతిపత్రం అందజేశారు. సుభాషిణి ఎన్నికల నిర్వహణ కోసం వెళ్తూ ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. అలాగే ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేసియా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.