విజయనగరం కోట : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా పైనేనని ఏఐసీసీ పరిశీలకులు మనోజ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆదివారం విజయనగరం పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన తొలిత ఆదిరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ఐదు హామీలు, రాష్ట్రంలో ప్రకటించిన 9 హామీలు మనకు ప్రధాన ఆయుధమని వాటి ద్వారానే కర్ణాటక రాష్ట్రంలో గాని ఇటు తెలంగాణ రాష్ట్రంలో గాని గెలిచామన్నారు. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైనే తొలి సంతకం రాహుల్ గాంధీ పెట్టనున్నారన్నారు. అదేవిధంగా విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా కాపాడుతామన్నారు. పోలవరం పనులను పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్దే అన్నారు. బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ తాలూకా బ్యాంక్ అకౌంట్ లన్ని సీజ్ చేశారన్నారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ ప్రజాప్రతినిధి జీబీవీఎస్ కమలాకర్ జిల్లా అధ్యక్షులు విజయనగరం సరగడ రమేష్ కుమార్, విజయనగరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుంకర సతీష్ కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ రామారావు రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు మహమ్మద్ హాసన్ షరీఫ్, జిల్లా మహిళా అధ్యక్షులు ఉమాదేవి, జిల్లా సీనియర్ నాయకులు సేనపతినేటి శ్రీనివాసరావు జిల్లా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.