- రెండు నెలలు ట్రయల్ రన్ నిర్వహణ
ప్రజాశక్తి- తిరుపతి టౌన్ : వందే భారత్ రైళ్లకు మనదేశంలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకువస్తున్న భారతీయ రైల్వే.. వీటితో పాటు వందే భారత్ మెట్రో రైళ్లను కూడా ప్రవేశపెడుతోంది. ఇప్పటికే చెన్నైలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఇవి రూపుదిద్దుకున్నాయి. వచ్చే జులై నుంచి వందే భారత్ మెట్రో రైళ్లు పరుగులు పెట్టే అవకాశం ఉండగా.. ఆంధ్రప్రదేశకు కూడా వందే మెట్రోను కేటాయిస్తారని సమాచారం. ఏపీలోని తిరుపతి, తమిళనాడులోని చెన్నై నగరాల మధ్య వందే భారత్ మెట్రో రైలును నడపనున్నట్లు సమాచారం. జులై నెలలోట్రయల్ రన్ కూడా చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రెండు వారాల ట్రయల్ రన్ పూర్తైన తర్వాత పూర్తిస్థాయిలో తిరుపతి- చెన్నై మార్గంలో నడపాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే చెన్నై- తిరుపతి మధ్య వందే మెట్రో రైళ్లు నడిపేందుకు రెండు నెలలు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇదివరకే వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉండగా, 200 కి.మీ పరిధిలో ఉన్న నగరాలను అనుసంధానిస్తూ ఈ ఏడాది వందే మెట్రో రైళ్లు నడిపేందుకు భారత రైల్వే బోర్డు నిర్ణయించింది.