తెలంగాణ : నేడు హైదరాబాద్లో ఎర్త్ అవర్ ను పాటించనున్నారు. ఈరోజు రాత్రి గంటపాటు నగరమంతా చీకటిగా మారనుంది. ప్రజలంతా లైట్లను విద్యుత్ ఉపకరణాలను ఆపేస్తారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు ఎర్త్ అవర్ ను పాటించనున్నారు.
ఎర్త్ అవర్ అంటే ?
ఎర్త్ అవర్ అనేది వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమం. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే, ఈ సంవత్సరం కూడా మార్చి 23 రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
పర్యావరణ పరిరక్షణ చర్యలపై అవగాహనే లక్ష్యం…
ఎర్త్ అవర్ 2024 సందర్భంగా ఆ సమయంలో, ప్రజలు, సంస్థలు ఒక గంట పాటు లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆపివేయాలని కోరింది. భూమి పట్ల నిబద్ధతకు చిహ్నంగా ఒక గంటపాటు. రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఒక గంట పాటు లైట్లు ఆర్పాలని ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం అసలు లక్ష్యం
గ్లోబల్ ఉద్యమంగా మారింది…
2007లో, సింబాలిక్ లైట్స్ అవుట్ ఈవెంట్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ఫాలో అవుతూ.. గ్లోబల్ ఉద్యమంగా మారింది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్లోనూ ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తోంది. అయితే.. ఈ ఎర్త్ అవర్ సందర్భంగా నగరంలోని ఐకానిక్ భవనాలన్నీ చీకటిగా మారనున్నాయి.
విద్యుత్ ఆదా అయ్యింది : ఢిల్లీ అధికారులు
ఎర్త్ అవర్ పాటించడం వల్ల గతేడాది.. ఢిల్లీలో 279 మెగా వాట్ల విద్యుత్ ఆదా అయిందని అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గనాలని కోరుతూ టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లకు లేఖలు రాస్తోంది. భారతదేశంతో పాటు, లాస్ ఏంజిల్స్, హాంకాంగ్, సిడ్నీ, రోమ్, మనీలా, సింగపూర్, దుబారులలో ఈ ఎర్త్ అవర్ను పాటిస్తారు.