ప్రజాశక్తి-అమరావతి : ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్ చేసిన మోసం కంటే ఏపీలో జగన్ ఎక్కువగా తప్పులు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలోనూ అధికార మార్పిడి ఖాయమన్నారు. తెలుగు ప్రజానీకానికి బిజెపి వ్యతిరేకంగా ఉందని.. అయితే, ఆ పార్టీకి అనుకూలంగా జగన్ ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ, ఏపీలలో ఒక్కో లోక్ సభ స్థానంలో సీపీఐ పోటీ చేయనుందన్నారు. సీపీఐతో పొత్తు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో కాంగ్రెస్ ఒంటెత్తు పోకడ వల్లే ఓడిపోయిందని విమర్శించారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోవడం వల్ల గెలిచిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. ఇండియా కూటమి ఎంత అవసరమో… కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడం అంతే అవసరమన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/cpi.jpg)