ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అదనపు సేవ కోసం వలంటీర్లకు కార్పొరేషన్ నిధుల నుంచి నెలకు రూ.750 చొప్పున ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టరు టిఎస్ చేతన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్తు అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని ఈ నెల 13న సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ ప్రక్రియలో వలంటీర్లను భాగస్వామ్యులు చేయాలని, వలంటీర్ల షెడ్యూల్పై విస్తృత ప్రచారం కల్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.