అమరావతి : జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ … ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక చర్యలు రోజురోజుకూ మితిమీరుతున్నాయని మండిపడ్డారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. మాచర్ల టిడిపి ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అక్రమ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్థానిక వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఆయనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. చిన్న సంఘటనను అడ్డుపెట్టుకుని బ్రహ్మారెడ్డి దుర్భాషలాడినట్లు కథనాలు అల్లారనీ.. జగన్ రెడ్డి కట్టుకథలకు ఫుల్ స్టాప్ పడేరోజు దగ్గర్లోనే ఉందని నిప్పులుచెరిగారు. ఎన్ని కుట్రలు చేసినా, టిడిపి నేతలపై ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓటమిని ఎవరూ ఆపలేరన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం : కె.అచ్చెన్నాయుడు
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/achchennaidu.jpg)