ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):ప్రజల మద్దతుతో విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ బారి నుంచి కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ స్పష్టం చేశారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 1187వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్ ఎల్ఎమ్ఎస్బిఎం విభాగానికి చెందిన కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించి విద్యుత్తు ఆటంకం లేకుండా చేస్తే లాభాల బాటలో పయనించడం కష్టతరమైన విషయమేమీ కాదన్నారు. త్యాగాల ఫలితంగా దక్కిన విశాఖ ఉక్కును పోరాటాలతో కాపాడుకుంటామన్నారు. ప్లాంట్ను కారు చౌకగా కాజేయాలని చూస్తున్న కేంద్ర బిజెపి కుట్రలను ఐక్యపోరాటాలతో తిప్పికొడతామన్నారు. ఇప్పటి వరకూ కార్మికుల సమిష్టి కృషితోనే ప్లాంట్ను కాపాడుకుంటూ వచ్చామని, మున్ముందు మరింత అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
![visakha-steel-plant manganese mines](https://prajasakti.com/wp-content/uploads/2023/12/visakha-steel-plant-manganese-mines.jpg)