తిరుమల: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు మంత్రి రోజా కౌంటరిచ్చారు. ‘నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్..? తెలంగాణ బిడ్డను అని చెప్పుకుని.. ఇప్పుడు ఏపీ గురించి హడావిడి చేస్తున్నారని షర్మిలపై రోజా సీరియస్ అయ్యారు. శుక్రవారం ఉదయం ఏపీ క్రీడా సాంస్కృతిక శాఖా మంత్రి ఆర్.కె రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘టిడిపి నేత చంద్రబాబు నాయుడు 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డిఎస్సీలను సిఎం జగన్ ఇచ్చి 17 వేల పోస్టులను భర్తీ చేశారు. తాజాగా మరో 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడైనా ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలి.’ అని ఆమె హితవు పలికారు.
ఇక ఇదే సమయంలో ‘షర్మిలకు రాజకీయ అవగాహన లేదని నిన్న చేసిన హడావిడి చూస్తే అర్థమైంది. నాలుగున్నరేళ్లు ఏపీలో లేకుండా తాను తెలంగాణ బిడ్డను అని చెప్పుకుంది. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి జగన్పై విషం చిమ్ముతూ ఆరాటాలు, పోరాటాలు చూసి ప్రజలు నవ్వుతున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా పిచ్చి మాటలు మాట్లాడటం మానుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము’ అంటూ హెచ్చరించారు.