రాజధాని నిర్మాణంపై నేడు శ్వేతపత్రం విడుదల..

అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆ పనిలో పడిపోయారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసి వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఇక, ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.. అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించేందుకు రెడీ అయ్యారు. ఐకానిక్‌ భవనాల నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని తెలియచెప్పనున్నారు.. రాజధాని పునర్‌ నిర్మాణం కోసం తామేం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించే అవకాశం ఉంది..
మరోవైపు.. రాజధాని నిర్మాణంపై ఇప్పటికే వివిధ కాంట్రాక్ట్‌ సంస్థలతో భేటీ అయ్యారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం జంగిల్‌ క్లియరెన్స్‌, బుష్‌ క్లియరెన్స్‌ పై ఫోకస్‌ పెట్టింది.. ఇక, అమరావతి రాజధాని నిర్మాణంపై రూపొందించిన శ్వేతపత్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వెలగపూడి సచివాలయంలో పట్టణాభివఅద్దిశాఖ మంత్రి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే.. శ్వేతపత్రంలో ఏమేమి అంశాలు చేర్చాలి, ఇంకేమైనా ఉన్నాయా అన్న వివరాలను అడిగి తెలుసు కోవడంతోపాటు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రాజధాని ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి.. పనులు ఎక్కడి వరకు జరిగాయి.. ఎక్కడ నిలిచిపోయాయి. అనే అంశాలపై ఆరా తీసిన విషయం విదితమే.

➡️