క్రికెట్‌ చూసిన ప్రధాని… మణిపూర్‌ ఎందుకెళ్లలేదు?

Nov 26,2023 09:09 #press meet, #seetharam yechuri

-బిజెపిని ఓడించడమే మా లక్ష్యం

-నాలుగు రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి ప్రతికూల ప్రభావం

-సుప్రీం తీర్పును గవర్నర్లు అమలు చేయాలి

-అభ్యర్థులకే కాదు పార్టీల ఖర్చుపైనా పరిమితి ఉండాలి

– మీట్‌ ది మీడియాలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరోవన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లిన ప్రధాని మోడీ… మణిపూర్‌కు ఎందుకెళ్లలేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూటిగా ప్రశ్నించారు. దేశంలో బిజెపిని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (టిడబ్ల్యుజెఎఫ్‌), హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌యుజె) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మీట్‌ ది మీడియా కార్యక్రమంలో సీతారాం ఏచూరి పాల్గన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఐదు రాష్ట్రాల్లో బిజెపి ఓటమి కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల్లో బిజెపికి ప్రతికూల ప్రభావముందని చెప్పారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలున్నాయని వివరించారు. రాజస్థాన్‌లో పోటాపోటీ ఉందని, కానీ బిజెపి పట్ల వ్యతిరేకత ఉందని తెలిపారు. మోడీ పాలనలో నిరుద్యోగం, పేదరికం పెరిగిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవని తెలిపారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ధరల పెరుగుదల ప్రభావం ప్రజల్లో తీవ్రంగా ఉందని తెలిపారు. మోడీ ప్రభుత్వంలో ఎవరికీ జవాబుదారీతనం లేదన్నారు. ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌కు అనుమతి ఇచ్చింది ఎవరని, ఆ ఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. మోడీ ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా ఇసి నోటీసులు ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలకు మాత్రం వెంటనే నోటీసులు ఇస్తోందని వివరించారు. తెలంగాణలో పొత్తు ఎందుకు కుదరలేదో కాంగ్రెస్‌ పార్టీనే అడగాలన్నారు. ఖమ్మంలో తమకు ఒక్క సీటూ ఇవ్వకుండా కాంగ్రెస్‌తో పొత్తు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అందుకే తాము 19 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెప్పారు. తాము పోటీ చేయనిచోట బిజెపిని ఓడించే పార్టీలకు మద్దతు ఇస్తామని, స్థానిక కమిటీలు నియోజకవర్గాల వారీగా నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. సిపిఎం పొత్తు లేకుంటే నష్టం వస్తుందన్న భావనలో కాంగ్రెస్‌ లేదన్నారు. రాష్ట్రంలో హంగ్‌ వస్తే బిజెపి మద్దతును బిఆర్‌ఎస్‌ తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా, తక్కువ సీట్లు వచ్చినా దొడ్డిదారిన అధికారంలోకి వచ్చే నీచమైన చరిత్ర బిజెపిదని తెలిపారు. ఇడి, సిబిఐ, ఇసి, సుప్రీంకోర్టు కేంద్రం చేతిలో బందీ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఉందని, పార్టీల ఖర్చుపై పరిమితి లేదని చెప్పారు. అందుకే రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాయన్నారు. జర్మనీ తరహాలో ప్రభుత్వమే అభ్యర్థులకు ఖర్చు చేసే నిధులను ఇచ్చే పద్ధతి రావాలని చెప్పారు. ఎపి మాజీ సిఎం చంద్రబాబు అరెస్టు తీరును ఖండిస్తున్నామన్నారు. అసలు వాస్తవమేంటో త్వరలో బయటపడుతుందని చెప్పారు. పోరాడాలంటే ఎర్రజెండా కావాలని, ఓటేసేందుకు వేరే పార్టీలను ప్రజలు ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్‌ సంస్థలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుకు తాము వ్యతిరేకమని తెలిపారు. టిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఐఎఫ్‌డబ్ల్యుజె జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, హెచ్‌యుజెకార్యదర్శి బి.జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️