-జనవరి ఒకటి నుంచి అమలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరోఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పెన్షన్ను రూ.3 వేలకు పెంచుతూ జిఓ 96ను జారీ చేసింది. జనవరి ఒకటి నుంచి పెంచిన పెన్షను అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వైఎస్ఆర్ పెన్షన్ పేరిట వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 వేలుగా ఉన్న పెన్షన్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2,250 పెంచింది. 2022లో రూ.2,500, 2023లో జనవరి ఒకటి నుంచి రూ.2,750 పెంచి పంపిణీ చేస్తూ వస్తుంది. దీనిని రూ.3 వేలకు పెంచి జనవరి ఒకటి 2024 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12 రకాల పెన్షన్లో కొత్తగా దరఖాస్తు చేయదలచుకున్న వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలి.