సంగారెడ్డి (తెలంగాణ) : పటాన్చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో మధుసూదన్ను శుక్రవారం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడికి బిఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మధుసూదన్ అరెస్ట్ నేపథ్యంలో … ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్రావు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మరోవైపు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ను నిరసిస్తూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ … దేశం మొత్తంలో ఎన్నో క్వారీలున్నాయన్నారు. పూర్తి పర్మిషన్తో క్వారీలు నడిపిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని… ప్రజా కోర్టులో తేల్చుకుంటామని అన్నారు. కింది స్థాయి నుంచి ప్రజల మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్నామని… తమ తమ్ముడిని అక్రమంగా అరెస్ట్ చేశారు అని వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ … తెలంగాణలో కాంగ్రెస్ వంద రోజలు పాలన ఎలా తయారైందంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తారు అని ఆరోపించారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారని అన్నారు. వందలాదిమంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసం. అంత అవసరం ఏముంది ? అని ప్రశ్నించారు. ‘ నోటీసులు ఇవ్వరు.. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. అధికారం శాశ్వతం కాదు. గత పదేళ్లలో మేము ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదు. ప్రభుత్వం ఇలాంటి విధానాలను మార్చుకోవాలి.’ అని అన్నారు.