జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శ్రీనివాస్
ప్రజాశక్తి – కామవరపుకోట
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాహనాల తనిఖీలు విస్తృత పరచాలని జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి జె.శ్రీనివాస్ ఆదేశించారు. కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ను ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తనిఖీ చేసిన కార్ల నెంబర్ల రిజిస్టర్ పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సజావుగా ఎన్నికలు జరిపేందుకు ప్రతిఒక్కరిని సమాయత్తం చేయాలన్నారు. కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, అందులో కామవరపుకోట చెక్పోస్ట్ తనిఖీలో 20 మంది వ్యక్తుల నుంచి అనధికార సొమ్మును స్వాధీనం చేసుకోవడం చెక్పోస్ట్ సిబ్బంది పనితీరు ఆదర్శనీయమన్నారు. చెక్పోస్ట్లో పలు వాహనాలను తనిఖీ చేశారు. చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్, జిల్లా ప్లయింగ్ స్క్వాడ్ ఎక్సైజ్ సిఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ కె.శేషారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కె.రమేష్, కె.రామకృష్ణ, జి.సూర్యరావు, గోవర్ధన్, శ్రీనివాస్, వీడియో గ్రాఫర్ వీరమల్ల మధు పాల్గొన్నారు.