కర్నాటక : కర్నాటకలోని చామరాజనగర్కు చెందిన బిజెపి ఎంపి, కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ (76) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. శ్రీనివాస్ ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
శ్రీనివాస్ ప్రసాద్.. చామరాజనగర్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. మైసూర్ జిల్లా నంజనగూడ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకుంటున్నట్లు గత నెల 18వ తేదీన ప్రకటించారు. 1976లో జనతా పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం 1979లో కాంగ్రెస్లో చేరారు. బిజెపిలో చేరడానికి ముందు కొంతకాలం జేడీఎస్, జేడీయూ, సమతా పార్టీలోనూ పని చేశారు. అటల్ బిహారీ వాజ్పేయీ ప్రధానిగా ఉన్న 1999-2004 సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో తిరిగి కాషాయ గూటికి చేరారు. 2017లో నంజన్గుడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోయారు. 2019లో చామరాజనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.