ప్రజాశక్తి-అమరావతి : మహారాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేసేలా ఇసికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ మంగళగిరికి చెందిన బి భిక్షమయ్య గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో పాల్గొన్న పోలీసులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఇసి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రణతి వాదించారు. ఎపి నుంచి మహారాష్ట్రకు పోస్టల్ బ్యాలెట్లను పంపాల్సిన గడువు గురువారంతో ముగుస్తుందన్నారు. మహారాష్టలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఇసి తరఫున న్యాయవాది సత్యశివ దర్శన్ చెప్పారు. పూర్తి వివరాలు అందజేయాలని జస్టిస్ బి కృష్ణమోహన్ ఇసిని ఆదేశించి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.