ప్రజాశక్తి – తవణంపల్లి (చిత్తూరు జిల్లా) :ఏనుగు దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో చోటుచేసుకుంది. అటవీ అధికారుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లె మండలం వెంగంపల్లె గ్రామానికి చెందిన పి.చిన్నయ్య (50) ఆదివారం ఉదయం కాలనీకి సమీపంలోని మామిడి తోటలో బహిర్భూమికి వెళ్లారు. ఏనుగును చూసిన కుక్కలు మొరిగాయి. దీంతో చిన్నయ్య అటుగా వెళ్లగా.. ఆయనను ఏనుగు వెంబడించి చంపేసింది. స్థానిక అటవీ శాఖ, పోలీసు అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబానికి అటవీ శాఖ అధికారులు రూ. పదివేలు ఎక్స్గ్రేషియా అందజేశారు.