- కొనసాగుతున్న యాత్రికుల రద్దీ
ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో యాత్రికులు రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, ఎలక్షన్లు పూర్తి కావడంతో శ్రీవారి దర్శనానికి యాత్రికులు పొట్టెత్తారు. దీనికి తోడు శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య యాత్రికుల రద్దీ కూడా పెరిగింది. శ్రీవారి దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాలలో విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టిటిడి పేర్కొంది.
శ్రీవారి సేవలో సంజయ్ జాజు దంపతులు
భారత సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, దూరదర్శన్ ఉన్నత స్థాయి అధికారులతో తిరుపతిలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.