ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈ నెల 27, 28 తేదీల్లో సుదీర్ఘ వాదనలు వింటామని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా బెయిల్ పిటిషన్లపై సోమవారం సిబిఐ, కవిత తరపున వాదనలు వింటామని పేర్కొంది. అలాగే మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించింది. లిక్కర్ కేసులో ఇడి, సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు, అలాగే ట్రయల్ కోర్టు కవిత అరెస్టుకు సిబిఐకి అనుమతి, కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్షీట్లలో మొత్తం 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టాలను పరిగణనలోకి తీసుకొని ఆమెకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి హైకోర్టును విజ్ఞప్తి చేశారు.