- షర్మిలపై వ్యాఖ్యలను ఖండించిన ఎంఎస్ బాబు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ : కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై మాజీ ఎంపి చింతామోహన్ చేసిన విమర్శలు అర్ధరహితమని పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు అన్నారు. చిత్తూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భూస్థాపితమైన కాంగ్రెస్కు పూర్వవైభవం రావడానికి కారణం షర్మిల అని పేర్కొన్నారు. సీనియర్ నాయకుడని చెప్పుకునే చింతామోహన్ పార్టీ కోసం ఏమీ చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కొత్త వాళ్ళు రాకూడదనే ఉద్దేశంతో చింతా మోహన్ పనిచేయడంతో.. పదేళ్లుగా పార్టీకి మనుగడ లేకుండా పోయిందనీ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఆశయాలను సాధించేందుకు షర్మిల ప్రయత్నిస్తుంటే.. ఆమెను వెనక్కు లాగేందుకు చింతా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో షర్మిల డబ్బు తీసుకుని టికెట్ ఇచ్చారని ఆరోపించిన చింతా మోహన్ కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్, నాయకులు రవి, వెంకటేష్, రాణి తదితరులు పాల్గొన్నారు.