అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్కు షెడ్యూల్ను ఎపి ఈఏపీసెట్ కన్వీనర్ నవ్య శనివారం విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం… ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జులై 1 నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. జులై 4 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8 నుంచి 12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇచ్చారు. జులై 13న ఐచ్ఛికాల మార్పు చేసుకోవచ్చు. జులై 16న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జులై 17 నుంచి 22వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని కన్వీనర్ పేర్కొన్నారు. ఇక జులై 19 నుంచి అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని, ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశాలకు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx
ఏపీ ఈఏపీసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్
జులై 1 నుంచి జూలై 7 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు
జులై 4 నుండి 10వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్
జులై 8 నుండి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
జులై 13వ తేదీన ఆప్షన్ల మార్పునకు అవకాశం
జులై 16వ తేదీన సీట్ల కేటాయింపు
జులై 17 నుంచి 22వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్టింగ్
జులై 19వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం
ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలను కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగతి విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 3,39,139 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈఏపీసెట్ మార్కులకు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి, వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 1,95092 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ స్ట్రీమ్లో 70,352 మంది ఉత్తీర్ణత సాధించారు.