జిల్లాలో 27,721మంది తల్లుల ఖాతాలో రూ.18.72కోట్లు జమ : కలెక్టర్
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: అర్హులైన ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా దీవెన పథకం వర్తింపజేసినట్లు జెడ్పి ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం వైఎస్ జగన్ విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. చిత్తూరు జిల్లా సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో జెడ్పి ఛైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డెప్ప, జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, మేయర్ అముద ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ.. చిత్తూరు జిల్లాలోని 30,111మంది విద్యార్థులకు రూ.18.72కోట్లును 27,721మంది తల్లుల ఖాతాలోకి జమ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం విద్యా దీవెన చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జెడ్పి వైస్ ఛైర్మన్ రమ్య, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బి.సురేష్, జిల్లా సాంఘిక, బిసి, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు రాజ్యలక్ష్మి, రబ్బానీ భాష, మూర్తి తదితరులు పాల్గొన్నారు.