ప్రజాశక్తి-అనంతపురం : కలెక్టరేట్’అనంత’ తెలుగు భాషా వైభవ సదస్సు మంగళవారం అనంతపురంలోని జెఎన్టియు ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి.విజయబాబు, ఎపి సిఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా నిర్వహించిన ”జయహో కృష్ణదేవరాయ” నృత్యరూపకం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారాలను పది మందికి, 38 మందికి తెలుగు భాషా సేవా ప్రతిభ పురస్కారాన్ని అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిర్వహించిన ప్రత్యేక ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.