ప్రజాశక్తి- నగరి : మహారాష్ట్ర గచ్చిరోలిలో జరిగిన 69వ సీనియర్ నేషనల్ బాల్ బాడ్మింటన్ పోటీలలో మన రాష్ట్రం ద్వితీయ స్థానం సాధించగా పుత్తూరు రూరల్ మండల కేబీఆర్ పురంకు చెందిన రూపేంద్ర ఉత్తమ ప్రతిభ కనబరచి స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు పొందాడు. గురువారం మంత్రి నివాసానికి విచ్చేసిన రూపేంద్రను రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అభినందించారు. జాతీయ స్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచడం, స్టార్ ఆఫ్ ఇండియా పురస్కారం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించడానికి పలు పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పాఠశాలస్థాయి నుంచే క్రీడాకారులను రూపొందించడానికి తల్లితండ్రులు ప్రోత్సాహించాలన్నారు. నియోజకవర్గంలో ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడంలో ఆసక్తి కనబరుస్తున్న ఫిజికల్ డైరెక్టర్ గోపిని అభినందించారు. క్రీడాకారులు రూపేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, మంత్రి అందించిన సహకారంతోనే స్టార్ ఆఫ్ ఇండియా సాధించారన్నారు.