న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని ఎన్సిపి రెబల్ నేత అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువును సుప్రీంకోర్టు సోమవారం పొడిగించింది. ఫిబ్రవరి 15లోగా నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్కు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, జస్టిస్ జెబి. పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అనర్హత పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేసేందుకు మరి కొంత సమయం కావాలని స్పీకర్ రాహుల్ నర్వేకర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు గతంలో సుప్రీంకోర్టు జనవరి 31 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్ పవార్ వర్గం నేత జయంత్ పాటిల్ స్పీకర్ రాహుల్ నర్వేకర్ను కోరారు.