న్యూఢిల్లీ : ప్రభుత్వ టెలికం సంస్థ బిఎస్ఎన్ఎల్ వచ్చే ఆగస్ట్ నుంచి దేశ వ్యాప్తంగా 4జి సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడానికి సిద్దం అవుతోంది. దేశంలో 4జి, 5జి సేవల కోసం బిఎస్ఎన్ఎల్ 1.12 లక్షల టవర్లను అప్గ్రేడ్ చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4జి సేవల కోసం 9,000 టవర్లను ఇన్స్టాల్ చేసింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి ఈ సేవలు అందించనున్నట్లు బిఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. 700 మెగాహెర్ట్జ్ ప్రీమియం స్పెక్ట్రమ్ బ్యాండ్తో పాటు పైలట్ దశలో 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్లో రూపొందించిన 4జి నెట్వర్క్ ద్వారా సెకనుకు 40-45 ఎంబి స్పీడ్తో ఇంటర్నెట్ ఉంటుందని అధికారులు తెలిపారు. నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసేందుకు ఐటి సేవల దిగ్గజం టిసిఎస్, ప్రభుత్వ టెలికాం రీసెర్చ్ ఆర్గనైజేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. 4జి పైలట్ ప్రాజెక్ట్ పంజాబ్లో చాలా బాగా పని చేస్తోందని అధికారులు అంటున్నారు. గత 4-5 ఏళ్లుగా బిఎస్ఎన్ఎల్ 4జి సామర్థ్యమున్న సిమ్లను మాత్రమే విక్రయిస్తోంది.