- ఈ ఏడాది 6.4 శాతం వృద్థి
న్యూఢిల్లీ : వచ్చే ఏడేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీ ఎస్అండ్పి అంచనా వేసింది. ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా..2030 నాటికి మరో రెండు స్థానాలు ముందుకు జరగనుందని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్లు వరుస స్థానాల్లో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అత్యంత వేగంగా వృద్థి చెందుతున్న దేశంగా నిలువనుందని తెలిపింది. అతిపెద్ద తయారీ కేంద్రంగా నిలవడమే ఇప్పుడు భారత్ ముందున్న సవాల్ అని ఎస్అండ్పి విశ్లేషించింది. 2023- 24లో భారత జిడిపి 6.4 శాతం వృద్థిని నమోదు చేయనుందని అంచనా వేసింది. వచ్చే ఏడాది ఇది 6.9 శాతానికి, 2026-27 నాటికి 7 శాతం పెరుగుదలను సాధించవచ్చని తెలిపింది.