6 గంటల్లోనే రైల్వే క్యాన్సిల్‌ టికెట్ల సొమ్ము!

May 10,2024 22:05 #cancel ticket money, #railway

ముంబయి : ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేయించుకునే రైల్వే ప్రయాణికులు బుక్‌ చేసిన ట్రైన్‌ టికెట్‌ను ఏ కారణం వల్లనైనా క్యాన్సిల్‌ చేసినా, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండి చివరి నిమిషంలో ఇాటికెట్‌ రద్దయినా ఆ సొమ్ము వెనక్కి ఇచ్చే ప్రక్రియను రైల్వే శాఖ వేగవంతం చేసింది. క్యాన్సిల్‌ చేసుకుంటున్న ఇ-టికెట్లకు సంబంధించి దాదాపు 50 శాతం రిఫండ్లను కేవలం ఆరు గంటల్లోనే సెటిల్‌ చేస్తున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. రద్దు చేసుకున్న ఇ-టికెట్లతో పాటు టిడిఆర్‌ ఫైలింగ్‌ విషయంలోనూ 98 శాతం క్లెయిమ్‌లను ఒకరోజులోనే పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రైల్వే టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నప్పుడు, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న సందర్భంలో క్యాన్సిల్‌ అయినప్పుడు రిఫండ్లకు కనీసం 3-4 రోజుల గడువు పడుతోంది. టికెట్‌ డిపాజిట్‌ రిసీట్‌ విషయంలో మరింత ఎక్కువ సమయం పడుతోంది. మానవ సంబంధం లేకుండా అన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతున్న వేళ.. రిఫండ్ల జారీకి మాత్రం ఎందుకింత ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్న ప్రయాణికుల నుంచి ఉత్పన్నం అవుతోంది. దీంతో రిఫండ్ల జారీని రైల్వే వేగవంతం చేసింది. వేసవి రద్దీ నేపథ్యంలో రైల్వే తాజా నిర్ణయం ప్రయణికులకు ఊరట కల్పించేదే. సాధారణంగా ఫైల్‌ చేసేటప్పుడు రిఫండ్లు రావడానికి చాలా సమయమే పట్టేది. ఇందుకోసం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో టిడిఆర్‌ ఫైల్‌ చేస్తే.. ఆ వినతి సంబంధిత రైల్వే జోనల్‌ కార్యాలయానికి చేరుతుంది. దాన్ని టిటిఇ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సుదీర్ఘ సమయం తీసుకునేది. అయితే, ఒకప్పటిలా కాకుండా టిటిఇల వద్ద ట్యాబ్‌ లాంటి పరికరాలు వచ్చాయి. దీంతో టిటిఇ ఎంటర్‌ చేసిన సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా నమోదవుతోంది. ఒకవేళ ఎవరైనా టిడిఆర్‌ ఫైల్‌ చేస్తే కొన్ని గంటల్లోనే సమాచారాన్ని ధ్రువీకరించుకుని రిఫండ్లు జారీ చేస్తున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

➡️