ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యను కాషాయీకరణ కాకుండా కాపాడుకుందామని స్థానిక బాలాజీ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేశారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సదర్భంగా ఎస్ ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్ మాట్లాడుతూ దేశాన్ని సర్వసత్తాక , లౌకిక , గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుని వాటిని ఆచరణలోకి తీసుకురావడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలం అయ్యాయని అన్నారు. ఎన్ఇపి విద్వేషకర విధానాన్ని తీసుకువచ్చి పూర్తిగా విద్యారంగాన్ని కాషాయికరణ చేస్తున్నారని , ఇదేనా అంబేద్కర్ ఆశయాలను సాధనకు కృషి చేయడం అంటూ దుయ్యబట్టారు. రోజురోజుకు దేశంలో మతోన్మాద దాడులు పెరుగుతున్నాయని, మైనార్టీలు దైర్యంగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదని అన్నారు. విద్యా సంస్థలలో లౌకిక తత్వాన్ని పెంపొందించాలని, విద్యార్థులు అందరూ సోదరభావంతో మెలగాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న పాలక వర్గాలకు తగిన బుద్ది చెప్పాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్, సిహెచ్ పావని, జిల్లా అధ్యక్షులు డి.రాము, ఉపాధ్యక్షులు జె. రవికుమార్, ఎం. సౌమ్య, ఎం.వెంకీ, జిల్లా సహాయ కార్యదర్శులు పి.రమేష్, జిల్లా కమిటీ సభ్యులు రాజు, సోమేష్, అర్జున్, నాయకులు సంధ్య , సుస్మిత, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.