ప్రజాశక్తి-పరవాడ
మండలంలోని నాయుడుపాలెం పంచాయతీ తిమ్మయ్యపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ధియోనిల్ క్లోరైడ్ కెమికల్స్ను పోలీసులు పట్టుకున్నారు. పరవాడ సిఐ బాల సూర్యారావు తెలిపిన వివరాలు ప్రకారం… తిమ్మయ్యపాలెం గ్రామానికి చెందిన పైలా జగదీశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి వెనుక ఉన్న చీపురపల్లి దేముడుకు చెందిన కొబ్బరితోటలో 60 నీలం రంగు ప్లాస్టిక్ డబ్బాలలో సుమారు 8వేల కేజీల థియోనిల్ క్లోరైడ్ అను కెమికల్ను, 20 నీలం రంగు ప్లాస్టిక్ డబ్బాలలో సుమారు 3వేల కేజీల మిక్షిడ్ అవశేషాలు రసాయనాన్ని నిల్వ చేశారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, చుట్టుపక్కల గ్రామంలో నివసించే ప్రజలకు హానికరం అని తెలిసి కూడా నిల్వ ఉంచినట్లు సిఐ బాలసూర్యరావుకు అందని ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. నిల్వ ఉంచి కెమికల్స్ను స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బాల సూర్యారావు తెలిపారు.