త్రిపురనేని రామస్వామి చిత్రం పటం వద్ద పలువురి నివాళి
ప్రజాశక్తి-ముమ్మిడివరం
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బుద్ధ పార్కు ఆవరణలో ప్రజ్ఞా సాహితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా. పుల్లేపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం హేతువాద అభ్యుదయ కవి, రచయిత త్రిపురనేని రామస్వామి 81వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్.అంబేడ్కర్, రచయిత రామస్వామి చిత్రపటాలకు ఎం.ఆశీర్వాదం తదితరులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యానికి అసలైన ఆయువుపట్టు కవిరాజు త్రిపురనేని రామస్వామి అని అన్నారు. అభ్యుదయ సాహిత్యానికి సొంత అస్తిత్వం చేకూర్చిన భావ విప్లవ. వైతాళికునిగా జాతీయ స్థాయిలో రామస్వామి గుర్తింపు పొందారని కొనియాడారు. ఆయన రాసిన శంభుక వధ, ఖూనీ వంటి నాటకాలతో పాటు కురుక్షేత్ర సంగ్రామం, భగవత్ గీత వంటి కావ్యాలు, గోపాల రాయకుప్పుస్వామి వంటి శతకాలు హేతువాద ప్రజాదరణ పొందాయి. నేటి మనువాద ప్రభుత్వాల తీరు తెన్నుల పై రామస్వామి ఆనాడే పోరాటం చేశారని గుర్తు చేశారు. అనంతరం ప్రముఖ గాయకులు వి.చిరంజీవి ని స్వరమాధురి బిరుదుతో తాడిజానికీ రామ్ చేతులు మీదుగా దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వి.శ్రీ రామారావు, యలమంచిలి బాలరాజు, విత్తనాల వర ప్రసాదరావు, ఎన్ .అబ్బులు, ఉంగరాల వెంకటేశ్వర రావు, శరత్, ఎస్.పథ్వీరాజ్, సత్తి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.