ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : లోకేష్‌

Jan 19,2024 01:00

ప్రజాశక్తి – మంగళగిరి : అన్ని అవకాశాలున్నా తాగునీటి సౌకర్యమైనా లేని మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందుకోసం అన్నివర్గాలు కలసి రావాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కోరారు. మంగళగిరి పరిధిలోని తటస్త ప్రముఖులతో ఆయన వరుస భేటీలు కొనసాగుతున్నాయి. గురువారం మంగళగిరికి చెందిన ప్రముఖులు పొట్టి గిరిజ, ప్రగడ రాజశేఖర్‌, తెంపల్లి రాఘవేంద్రరావుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత మంగళగిరి 32వ వార్డులో నివాసముంటున్న వైద్యదంపతులు డాక్టర్‌ పొట్టి గిరిజ, డాక్టర్‌ పొట్టి ఆదినారాయణ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆదినారాయణ సోదరులు కిరాణా మర్చంట్స్‌గా స్థిరపడ్డారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలను లోకేష్‌ అడిగారు. వైద్యులుగా నిత్యం వందలాది మందికి సేవలందిస్తున్న గిరిజ, ఆదినారాయణలను అభినందించి, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో వైద్యసేవలు విస్తృతం చేసేందుకు సహకారం తీసుకుంటామని చెప్పారు. 14వ వార్డుకు చెందిన ప్రగడ రాజశేఖర్‌ను వారి ఇంటివద్దకు వెళ్లి కలుసుకున్నారు. రాజశేఖర్‌ తాత ప్రగడ బాలనాగు సికె ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌ను ఏర్పాటుచేసి విద్యాదాతగా పేరొందారు. రాజశేఖర్‌ కుటుంబం మంగళగిరిలో అతిపెద్ద యార్న్‌ ఎగుమతిదారుగా చేనేత వ్యాపార రంగంలో ఉన్నారు. ఈ సందర్భంగా చేనేతలు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాజశేఖర్‌ వివరించగా లోకేష్‌ స్పందిస్తూ తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక తొలి ప్రాధాన్యత చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమేనని చెప్పారు. మార్కండేయ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ కాలేజి మేనేజ్‌ మెంట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా రాజశేఖర్‌ అందిస్తున్న సేవలను కొనియా డారు. 25వ వార్డుకు చెందిన తెంపల్లి రాఘవేంద్రరావును ఆయన నివాసంలో లోకేష్‌ కలుసుకున్నారు. రాఘవేంద్రరావు విజయవాడలో టివిఎల్‌ ఎలక్ట్రికల్‌ కంపెనీ అధినేతగా, దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

➡️