ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు గ్రామానికి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి ఆరేటి కోటయ్య సతీమణి ఆరేటి కోటమ్మ గురువారం ఒంగోలులోని తన స్వగృహంలో మరణించిన విషయం పాఠకులకు విదితమే. ఆమె పార్థివ దేహాన్ని శుక్రవారం ఉదయం వారి స్వగ్రామమైన ఎండ్లూరుకు తీసుకొచ్చారు. విషయం తెలుసు కున్న పలువురు ప్రముఖులు ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో రాష్ట్ర మంత్రి, వైసిపి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగ నాగార్జున, వైసిపి మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, గ్రామసర్పంచ్ సోమా పుల్లయ్య, ఎంపీటీసీ కే వెంకటేశ్వరరావు, సంతనూతలపాడు సొసైటీ చైర్పర్సన్ దుంపా యలమందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టిడిపి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బిఎన్ విజరుకుమార్, ఆ పార్టీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల మధ్య అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు ఆరేటి సుందర రాజారావు, కుమార్తెలు సుగుణజ్యోతి, విజయజ్యోతి, ఇందిరాజ్యోతి, అల్లుళ్లు తెలంగాణ రాష్ట్ర డిఐజి జక్కుల శ్రీనివాసరావు, ఐఈఎస్ ఆఫీసర్ దాసరి ప్రసాద్, బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ వెంకట్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/sn-padu-meruga-nivali-ph.jpg)