ప్రజాశక్తి – కాకినాడ
సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యా శాకలో విలీనం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. సమగ్రశిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 4వ రోజుకు చేరింది. ఈ శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.పుల్లయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖలో పనిచేసే సమగ్రశిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటిని ఇవ్వాలని, పది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ పిఎఫ్, ఇఎస్ఐ తక్షణం వర్తింపజేయాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలలో కారుణ్య నియామకాలు చేపట్టాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచి పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి, మినిమం టైమ్ స్కెల్ అమలు చేసి వేతనాలు పెంచాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను, గౌరవ వేతనంపై, ప్రభుత్వ పథకాలలో పనిచేసే వారందరినీ మోసం చేస్తూనే ఉందన్నారు. ఆనాడు అధికారంలోకి రావడానికి ఉద్యోగులందరికీ ఆశపెట్టి, నేడు అధికారంలోకి వచ్చాక నిరాశను మిగిల్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లపాటు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నామని, ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా ఒంటెద్దు పోకడలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడంతో సమ్మె చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. నిత్యావసరాల ధరలు 200 నుంచి 600 శాతం పెరిగితే 2019 నాటి వేతనాలతో ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. తక్షణం సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ శిబిరానికి ఐద్వా నగర కార్యదర్శి జ్యోతి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు సంఘం రాష్ట్ర కోశాధికారి సిహెచ్.రవి, డిఇఒ ఐటి సెల్ విభాగం నుంచి ఎపిఒ వేకటేశ్వరరావు, కాకినాడ అర్బన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వాణికుమారి, కరప ఎస్టియు నాయకులు జిబి.భాస్కర్, రిటైర్ టీచర్ రాజశేఖర్ సంపూర్ణ మద్దతు తెలిపారు. శిబిరానికి జెఎసి అధ్యక్షులు ఎం.చంటిబాబు, పివివి.మహాలక్ష్మి, ఎ.సత్యనాగమణి, పి.రాజు, డి.గంగాధర్, డి.దానియేలు తదితరులు నాయకత్వం వహించారు.