ప్రజాశక్తి – కురుపాం: తన ఆత్మహత్యకు తహశీల్దార్, జిసిఎంఎస్ సేల్స్మాన్ల ఒత్తిడి కారణం అంటూ మండలంలోని గుమ్మ ఎండియు సీమలో నూకయ్య (36) కుటుంబ సభ్యులు ఆరోపించడంపై స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సమగ్ర దర్యాప్తునకు పాలకొండ ఆర్డిఒ ఎం.లావణ్యను ఆదేశించారు. బుధవారం మండలంలోని గుమ్మ పంచాయతీ గదబవలస ఎండియు ఆపరేటర్ స్వగ్రామంలో ఆర్డీవో దర్యాప్తు నిశితంగా చేపట్టారు. ఈ సందర్భంగా నూకయ్య భార్య జ్యోతి, ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నుంచి వివరాలు సేకరించారు. అనంతరం అధికారులతో దర్యాప్తు నిర్వహించి జాయింట్ కలెక్టర్ను నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనాధగా మిగిలిన నూకయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సేల్స్మాన్ జగదీష్ విచారణకు గైర్హాజరు కావడం విశేషం. దీంతో గుమ్మ డిఆర్ డిపో కు వెళ్లి దర్యాప్తు చేపట్టి, నిల్వలు పరిశీలించినట్లు తహశీల్దార్ రమేష్ కుమార్ తెలిపారు. ఎండియు ఆపరేటర్ సరుకులను తీసుకున్న మరో డిపో, లబ్దిదారులతో దర్యాప్తు త్వరలో చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని అన్నారు. కార్యక్రమంలో విఆర్ఒ గవరయ్య, సర్పంచ్ గోపాలరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/rdo.jpg)