పరిష్కారంప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై మొత్తం 624 ఫిర్యాదులు అందగా 602 ఫిర్యాదులకు పరిష్కరించామని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిశోర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే రాయచోటి కలెక్టరేట్లో జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ప్రత్యేక దష్టి సారించి అందిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 602 ఫిర్యాదులను పరిష్కరించగా 22 ప్రగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా రూ.79.54 లక్షల విలువైన నగదు, వస్తువులను సీజ్ చేశామన్నారు. ఇందులో రూ.42.24 లక్షల మేర నగదు, రూ.17.89 లక్షల విలువైన లిక్కర్, రూ.1.40 లక్షల విలువైన గంజాయి, రూ. 18.00 లక్షల విలువైన బంగారు, వెండి, ఇతర వస్తువులున్నాయన్నారు. ఎంసిసి అతిక్రమణల కింద ఏడు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశామని తెలిపారు.