ప్రజాశక్తి-సాలూరు : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రిటర్నింగు అధికారి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో ఎఎస్పి సునీల్ శ్రావణ్తో కలిసి పోలీసులు, ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది నియమాళి విధిగా పాటించాలని, ఎవరికి కేటాయించిన విధులు వారు ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. ఎంసిసి బృందాలు, ఖర్చుల పర్యవేక్షణ కమిటీ, పర్యవేక్షణ బృందాలు నిరంతరం అప్రమత్తతతో ఉండాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన 24 గంటల్లో ప్రభుత్వకార్యాలయం, ప్రాంగణాల్లో గల ఫోటోలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోనికి వస్తారని, అన్ని స్థాయిల ఉద్యోగులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా పాటించాలని, ఎంపిడిఒలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తనిఖీ బృందాలు విధులకు సంబంధించి ఎన్నికల సమయంలో జప్తుచేసిన డబ్బు, ఇతర వస్తువులకు సంబంధించి ఎన్నికల జప్తు నిర్వహణ వ్యవస్థ (ఇ.ఎస్.ఎమ్.ఎస్.) యాప్ రూపొందించడం జరిగిందని, తనిఖీ బందాలు వారు పట్టుకున్న డబ్బు,యితర వస్తువులను జప్తుచేసి కేసు పెట్టడంతో పాటు వాటి వివరాలను ఈ యాప్ లో తప్పని సరిగా నమోదు చేయాలని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలే చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో టౌన్ సిఐ వాసు నాయుడు, రూరల్ సిఐ బాలకష్ణ, ఎస్ఐలు కెవి సురేష్,ఎంవి రమణ, నారాయణ రావు పాల్గొన్నారు.
సీతంపేట : ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులకు స్థానిక ఐటిడిఎ పిఒ, పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కల్పనాకుమారి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన నియమాలు, రిపోర్టులు సమర్పించే అన్ని ఫారాలపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ నిర్వహణలో సెక్టార్ అధికారులు పాటించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల్లో పోలీస్ అధికారులు పాటించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీస్ హేమని కుమార్, శ్రీనివాస్, సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేయాలిఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కల్పనకుమారి అన్నారు. శుక్రవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్లతో సమావేశం నిర్వహించారు. కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోపు బహిరంగ ప్రదేశాల్లో ఉండే రాజకీయ నాయకులకు సంబంధించిన స్టిక్కర్లను, ఫ్లెక్షీలను తొలగించాలని, విగ్రహాలకు ముసుగులు తొలగించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. కోడ్ ఉల్లంఘన జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ, సిఐ, ఎంపిడిఒలు, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.