ప్రజాశక్తి రంపచోడవరం
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత పేర్కొన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏడు మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యల దరఖాస్తులన్నీ సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమును కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే, సబ్ కలెక్టర్ యస్.ప్రశాంత్కుమార్, ఐటిడిఎ ఎపిఓ జనరల్ సిహెచ్.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్రాజ్, డియస్. శాస్త్రి, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ షరీఫ్, ఏడియంహెఓ జి.ప్రకాశం, పిహెచ్ఓ కె.చిట్టిబాబు, రంపచోడవరం తహశీల్దారు ఎ.కృష్ణ జ్యోతి, వెలుగు ఎపీడీ ఎ.శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి.డేవిడ్రాజ్, ఎండి.యూసఫ్, ఎ.రవికుమార్, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.పోలింగ్ బూతులు పరిశీలన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బూతులలో మౌలిక సదుపాయాలు పక్కాగా ఉండాలని అల్లూరి జిల్లా కలెక్టర్ యం.విజయ సునీత పేర్కొన్నారు. సోమవారం గంగవరం మండలంలోని జడేరు గ్రామంలో 34, 35 పోలింగ్ బూతులను ఆమె పరిశీలించారు. పోలింగ్ బూతుల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ యస్.ప్రశాంత్ కుమార్, తహశీల్దారు శ్రీమన్నారాయణ, సెక్టర్ అధికారి విశ్వనాథం ఉన్నారు.ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ యం.విజయసునీత సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు అయ్యేంత వరకు విద్యార్థులకు తాగునీరు, వెలుతురు వంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు బాగా పరీక్షలు రాసి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఆమె వెంట రంపచోడవరం సబ్ కలెక్టర్ యస్.ప్రశాంత్ కుమార్, తహశీల్దారు ఎ.కృష్ణ జ్యోతి ఉన్నారు.