ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రానున్న ఎన్నికల్లో పాత పెన్షన్ విధానం సాధన ఎజెండాగా కావాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక కోట జంక్షన్ వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం రాజకీయ అజెండా కావాలన్నారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించి ఎటువంటి ఉపయోగం లేని జిపిఎస్ విధానం తీసుకొచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒపిఎస్ సాధన ఎజెండా చెయ్యాలని అన్ని రాజకీయ పక్షాలను కలుస్తామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ సంఘటిత పరిచి ఒపిఎస్ సాధన లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యను బలహీన పరిచే జీవో 117ను రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జెఆర్సి పట్నాయక్, ఐక్య ఉపాధ్యాయ సబ్ ఎడిటర్ కె.శ్రీనివాసరావు, రాష్ట్ర అకడమిక్ కమిటీ సభ్యులు డి.రాము, జిల్లా కార్యదర్శులు కె.ప్రసాదరావు, సిహెచ్. తిరుపతి నాయుడు పాల్గొన్నారు.