ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విఆర్ఎలకు పే స్కేల్, డిఎ బకాయిల చెల్లింపులతో పాటు బిఎల్ఒ డ్యూటీల మినహా యింపు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బి.సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట విఅర్ఎల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్ఎలకు సంబంధం లేని పనులు చేయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. కేవలం రూ.10,500 వేతనంతో బతకలేక ఇబ్బందులు పడతున్నారని తెలిపారు. పోరాడి సాధించుకున్న డిఎ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి వేలాది రూపాయలు తిరిగి రికవరీ చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఎలకు పే స్కేల్ అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. ఇటువంటి ద్రోహం చేసే పద్ధతులను వెంటనే విడనాడి విఆర్ఎల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆ సంఘం కార్యదర్శి జి.వెంకన్న, విఅర్ఎలు పాల్గొన్నారు.